ఆర్ఎస్ఎస్ మనిషి తరఫున ప్రచారం చేస్తారా? మేడమ్... ఇదేనా మీ సెక్యులరిజం: సోనియా గాంధీపై ఒవైసీ విమర్శలు

మాజీ సీఎం, బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన జగదీశ్ షెట్టర్ తరఫున ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రచారం చేయడంపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదేనా సెక్యులరిజం అంటూ ప్రశ్నించారు.  

హుబ్బలిలో జరిగిన ఓ ర్యాలీలో ఒవైసీ మాట్లాడుతూ... రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)కు చెందిన వ్యక్తికి సోనియా గాంధీ ప్రచారం చేస్తారని తాను ఊహించలేదని అన్నారు. ‘‘సోనియా గాంధీ గారూ.. మీరు ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన వ్యక్తి కోసం ప్రచారం చేస్తారని నేను ఊహించలేదు. జగదీశ్ షెట్టర్ ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన వ్యక్తి’’ అని చెప్పారు

‘‘ఇదేనా మీ సెక్యులరిజం? మోదీని ఇలాగే ఎదుర్కోవాలా?’’ అని మండిపడ్డారు. దురదృష్టవశాత్తు కాంగ్రెస్ సైద్ధాంతిక పోరాటంలో ఓడిపోయిందని, బీజేపీకి బీ-టీమ్ అంటూ ఆ పార్టీకి చెందిన జోకర్లు, సేవకులు, బానిసలు తమను నిందిస్తున్నారని ఒవైసీ ధ్వజమెత్తారు. 
 
బీజేపీ టికెట్ నిరాకరించడంతో మాజీ సీఎం జగదీశ్ షెట్టర్ ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం హుబ్బలి నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన తరఫున సోనియా గాంధీ నిన్న ప్రచారం చేశారు. ఈ సీటును కాంగ్రెస్, బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ప్రచారం చేస్తున్నాయి.

Asaduddin Owaisi
Sonia Gandhi
Jagadish Shettar
Congress
MIM
BJP
RSS
Karnataka Assembly Elections

More Telugu News